ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకునే తెలంగాణ భాషా దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఆయన రచనలు తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను చాటిచెప్పాయని అన్నారు.
తెలంగాణ భాష, యాసలోని పదును, ప్రత్యేకతను తన రచనల ద్వారా చాటిచెప్పిన ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా జరుపుకునే తెలంగాణ భాషా దినోత్సవం మనందరికీ ఎంతో ప్రత్యేకమైనది. ప్రజల భాషలోనే ప్రజల సమస్యలను, ఆకాంక్షలను తన రచనల్లో ప్రతిబింబించిన కాళోజీ గారు, తన కలాన్ని సామాజిక చైతన్యానికి సాధనంగా మలిచారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మానవ హక్కుల కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. తెలంగాణ భాష కేవలం మన మాట తీరు మాత్రమే కాదు, అది మన సంస్కృతి, మన జీవన విధానం, మన ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ భాషకు, యాసకు సాహిత్య గౌరవాన్ని తీసుకురావడంలో కాళోజీ గారి పాత్ర ఎంతో విశిష్టమైనది. ఈ సందర్భంగా తెలంగాణ భాషా వైభవాన్ని కాపాడుతూ, మన భాష పట్ల గౌరవాన్ని మరింతగా పెంపొందించుకోవాలి. కాళోజీ గారి ప్రజా చైతన్య స్ఫూర్తిని, ఆయన ఆలోచనా విధానాన్ని నేటి తరానికి అందించాలి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ, తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు








